క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్(సైబరాబాద్, గ్రామ దండోరా ప్రతినిధి) వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసు, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన ఏర్పాట్లపై బుధవారం సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ మునిసిపల్ అధికారులతో సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. అనంతరం కమిషనరేట్ పరిధిలోని పలు నిమజ్జన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఐడీపీఎల్, సూరారం తదితర చెరువుల వద్ద నిమజ్జనం కోసం చేపట్టిన ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సైబరాబాద్ పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సంయుక్తంగా పనిచేయాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్లు, విద్యుత్తు దీపాలు, గజ ఈతగాళ్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.నిమజ్జన సమయంలో భారీగా తరలివచ్చే భక్తులు, వాహనాల రాకపోకలకు అనుగుణంగా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సీపీ సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలు, అవసరమైన చోట అదనపు పోలీసు సిబ్బంది, బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిమజ్జన ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షిస్తూ, అన్ని శాఖలు సమన్వయంతో విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ జి. సృజన, మున్సిపల్ జోనల్ కమిషనర్లు, జాయింట్ సీపీ సన్ప్రీత్ సింగ్, డీసీపీ కోటి రెడ్డి, డీసీపీ రీతిరాజ్, ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిణి రెడ్డి, ఎస్బీ డీసీపీ సువేంద్ర, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇతర పోలీసు సిబ్బందితో పాటు విద్యుత్తు, మున్సిపల్, రెవెన్యూ, దేవాదాయ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్
